నోరు పారేసుకోవడంలో ఇద్దరూ ఒక్కటే

కేసీఆర్​, కేటీఆర్​, హరీష్​రావు కులగణనలో పాల్గొనలేదు. ప్రభుత్వం నిర్వహించే ఏ కార్యక్రమాల్లోనూ వారు మొదటి నుంచి పాల్గొనడంలేదు.

ఎవరో కొద్దిమంది తప్ప చాలామంది రాజకీయ నాయకులకు నోరు ఎక్కువే. నోరు పారేసుకుంటేనే రాజకీయాల్లో మనుగడ సాగించగలుగుతారేమో. ఇష్టం వచ్చినట్లు మాట్లాడటమే ఈనాటి రాజకీయ నాయకులకు తెలిసిన విద్య. కేసీఆర్​ ఉద్యమ నాయకుడిగా ఉన్నప్పటినుంచి నోరు పారేసుకుంటూనే ఉన్నారు. ఉద్యమంలో అది అనివార్యం కావొచ్చు.

కానీ, తెలంగాణ ముఖ్యమంత్రిగా పదేళ్లు పనిచేసిన సమయంలో కూడా కేసీఆర్​ తన నోటిని అదుపులో పెట్టుకోలేదు. నోటిని అదుపులో పెట్టుకోకపోవడం, ఉన్నత పదవుల్లో ఉన్నవారిని అవమానించడం, అగౌరవపరచడం ఈయన బలమో, బలహీనతో తెలియదు. కేసీఆర్​ అధికారంలో ఉన్నప్పుడు గవర్నర్​ తమిళసై సౌందరరాజన్​ను అవమానించారు.

ప్రధాని మోదీని అవమానించడమే కాకుండా దుర్భాషలాడేవారు. ఇష్టం వచ్చినట్లు మాట్లాడేవారు. ఆయన ఏవైనా అధికారిక కార్యక్రమాల కోసం రాష్ట్రానికి వస్తే స్వయంగా వెళ్లి ఆహ్వానించేవారు కాదు. ఓ మంత్రిని పంపేవారు. కేసీఆర్​ నోటి దురుసుకు, ఆయన అవమానించిన తీరుకు అనేక ఉదాహరణలు ఇవ్వొచ్చు.  కేసీఆర్​ తరువాత సీఎం అయిన రేవంత్​ రెడ్డి వ్యవహారశైలి కూడా అలాగే ఉంది.

ఆయన కూడా కేసీఆర్​పట్ల, ప్రధాని మోదీ పట్ల రెచ్చిపోతున్నారు. తన నోటి దురుసును నిరూపించుకుంటున్నారు. ఏదైనా అంటే ఇలా మాట్లాడటం కేసీఆరే నేర్పించారని అంటారు. అసలు తెలంగాణలో తిట్లు మొదలుపెట్టిందే కేసీఆర్​ అని చెబుతారు. ప్రభుత్వం నిర్వహించిన కుల గణనలో కేసీఆర్​, కేటీఆర్​, హరీష్​రావు పాల్గొనలేదు కాబట్టి వారి ముగ్గురిని సామాజిక బహిష్కరణ చేయాలని బీసీ సంఘాలకు పిలుపునిచ్చారు రేవంత్​ రెడ్డి.

వారి ఇళ్ల ముందు మేలుకొలుపు డప్పు కొట్టాలన్నారు. కేసీఆర్​కు తెలంగాణ సమాజంలో జీవించే హక్కులేదన్నారు. ఇక ప్రధాని పైనా ఘాటు విమర్శలు చేశారు. మోదీ పుట్టుకతో ఓసీ అయినప్పటికీ ఆయన బీసీగా మారారని అన్నారు. ఎవరైనా మతం మార్చుకుంటారుగాని కులం మార్చుకుంటారా? ఇది సాధ్యమా? మోదీ గుజరాత్​ సీఎం అయ్యాక తన కులాన్ని బీసీల్లో చేర్చుకున్నారని రేవంత్​ రెడ్డి చెప్పారు. ఆయన నిజమైన బీసీ అయితే కులగణన ఎందుకు చేయలేదని ప్రశ్నించారు.

అంటే ఆయన కులగణన చేయలేదు కాబట్టి మోదీ నిజమైన బీసీ కాదని రేవంత్​ రెడ్డి నిర్ణయించుకున్నాడన్నమాట. ఆయనది ఓసీ మనస్తత్వం అని కూడా చెప్పాడు. ఇక కేసీఆర్​, కేటీఆర్​, హరీష్​రావు కులగణనలో పాల్గొనలేదు. ప్రభుత్వం నిర్వహించే ఏ కార్యక్రమాల్లోనూ వారు మొదటి నుంచి పాల్గొనడంలేదు.

అంతమాత్రంచేత వారిని సామాజిక బహిష్కరణ చేయాలా? నిజానికి కులగణన సర్వేలో చాలామంది పాల్గొనలేదు. అయినప్పటికీ ప్రభుత్వం బీసీ జనాభా లెక్క తేల్చింది కదా. దాన్ని గురించి గొప్పగా చెప్పుకుంటోంది కదా. కేసీఆర్​ కుటుంబ సభ్యులు కులగణన సర్వేను లెక్కచేయలేదని, అవమానించారని రేవంత్​ రెడ్డికి కోపంగా ఉంది. అందుకే సామాజిక బహిష్కరణ చేయాలనే పెద్ద పదం వాడాడు. మొత్తం మీద కేసీఆర్​ రేవంత్​ మీద విరుచుకుపడితే, రేవంత్​ ఆయన మీద విరుచుకుపడతాడు.

One Reply to “నోరు పారేసుకోవడంలో ఇద్దరూ ఒక్కటే”

Comments are closed.